వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్నే మా భవిష్యత్తు’ (జేఎంబీ) అనే కొత్త ప్రచార నినాదాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జ్లు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో ఆయన జేఎంబీ లక్ష్యాలను వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రతి ఇంటికి ఈ నినాదంతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో జేఎంబీ మొదటి దశ ఫిబ్రవరి 18 నుంచి 26 మధ్య నిర్వహించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపంలో పార్టీకి 5.65 లక్షల సైన్యం ఉందని, వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. వీరంతా రాష్ట్రంలోని 1.65 కోట్ల ఇళ్లను సందర్శించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారని వెల్లడించారు. ఇక గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాలను కూడా వారు ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతారని, వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారంలో మన పార్టీ కార్యకలాపాలన్నింటినీ అమలు చేయడంలో గృహసారథులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఇప్పటివరకు 93% పైగా గృహసారధుల నియామకం పూర్తయిందని, మిగిలిన 7% ఫిబ్రవరి 16 నాటికి పూర్తవుతుందని తెలిపారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులతో శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలతో పాటు స్థానిక పౌరసమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ దాదాపు 7447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగిందని, సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించారని చెప్పారు. పార్టీ శాసనసభ్యుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, వివిధ సర్వేల ఆధారంగా జరిగిన తాజా సమీక్ష ప్రకారం దాదాపు 38 మంది శాసనసభ్యుల పనితీరు పేలవంగా కనిపించిందని తెలియజేశారు. వారు పనితీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో వారికీ టికెట్ రాదని, అలా చేస్తే కొత్త ముఖాలకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని జగన్ హెచ్చరించారు.
ఇక ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు గృహ సారథులు, గ్రామ, వార్డు వాలంటీర్లు, కన్వీనర్లకు మెగా క్యాంపెయిన్కు శిక్షణ నిర్వహిస్తామని, అనంతరం ఫిబ్రవరి 20న 26 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే మెగా క్యాంపెయిన్ను ఏకకాలంలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. అలాగే ఫిబ్రవరి 27లోగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో మరో 14 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఆయా జిల్లాల్లో కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని, కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE