ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుందని, అక్కడినుండే పరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పరిశ్రమలకు అనువైన ప్రాంతమని, 974 కి.మీ తీరప్రాంతం కలిగి ఉండటం ఏపీ ప్రత్యేకతని తెలిపారు. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం అమలులో ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్ళుగా ఏపీ దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తోందని తెలిపారు. పోర్టులకు కావాల్సిన భూములు అపారంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా మొత్తం 11 పారిశ్రామిక కారిడార్లు ఉంటే, అందులో 3 ఏపీలోనే ఉన్నాయని వివరించారు. ఇక తమ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా 540కి పైగా సేవలందిస్తున్నామని, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సరళతమైన విధానాలు అవలంబిస్తున్నామని తెలియజేశారు. ఏపీని తమ వ్యాపారాలకు ప్రధాన గమ్యస్థానంగా భావించే పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున సాదర స్వాగతం పలుకుతున్నామని సీఎం జగన్ అన్నారు.
అయితే ఒకవైపు రాజధాని కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న సమయంలో ఏపీ రాజధానికి సంబంధించి సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా సీఎం జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు గత నెలలో ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని కానున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే మరికొద్దినెలల్లో నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. ఈ ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా మా రాష్ట్రంలో వ్యాపారం చేయడం ఎంత సులభమో విదేశాల్లో ఉన్న మీ సహచరులకు కూడా చెప్పి తీసుకురండి’ అని సీఎం జగన్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE