ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు వైఎస్సార్సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం, కృష్ణా జలాలు వివాదం, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించి, పార్లమెంట్ లో ప్రస్తావించేలా లోక్సభ, రాజ్యసభ ఎంపీలుకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళం వినిపిస్తామని అన్నారు. అలాగే పోలవరం నిధుల అంశాన్ని, తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) పరిమితిని కేంద్రం నోటిఫై చేయాలని కోరనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. మరోవైపు ఈ సమావేశానికి ముందు ఎంపీ మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటులో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతామని పేర్కొన్నారు. దిశ చట్టం ఆమోదం, ఇతర రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ