కాపుజాతి అనే పదాన్ని తెరపైకి తెచ్చి.. ఆ జాతికి రాజ్యాధికారం తేవడమే తన లక్ష్యం అని పదేపదే చెప్పే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.? ప్రజలు మరచిపోతున్నారన్న తరుణంలో లేఖలో, కుల పలుకులో తెరపైకి తెచ్చి ముద్రగడ మళ్లీ కొన్నాళ్లు వెలుగుతుంటారు. ఏంచేసినా ముద్రగడ పద్మనాభంకు రాజకీయంగా కలిసి రావడం లేదు. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకున్న కోరికా తీరడం లేదు. కానీ కాపుజాతిని అడ్డుపెట్టుకుని ముద్రగడ అడపాదడపా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
నిజంగా ముద్రగడ పద్మనాభానికి కాపులపై ప్రేమున్నా, కాపుజాతికి అధికారం దక్కాలన్న కోరిక ఉన్నా ప్రస్తుత రాజకీయాల్లో సపోర్టు చేయాల్సింది ఎవరికి? అండగా ఉండాల్సింది ఎవరికి.. కానీ ఉంటోంది ఎవరికి..? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికితే.. ఆయన ఆప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వైసీపీకే సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కాపులకు అధికారం కోరిక ఉన్నా, ఆ అధికారం తనకు మాత్రమే దక్కాలనే స్వార్థం ముద్రగడ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. కాపులకు అధికారం దక్కాలని నిస్వార్థంగా కోరుకుంటే.. ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలి. కానీ.. గత ఎన్నికలకు ముందు, ఇప్పుడు కూడా ఆయన వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తూనే వచ్చారు. అయితే కొద్దిరోజుల ముందు ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, పవన్ కల్యాణ్ వచ్చి కలవలేదు కాబట్టి.. ఆయన చేరలేదన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా ముద్రగడ మాట్లాడుతూ, పవన్ వచ్చి కలుస్తారని భావించానని, ఆయన రాకపోవడంతో తన అవసరం లేదని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అంటే.. ఎవరైనా వచ్చి మాట్లాడితేనో, బతిమలాడితేనో లేదో పేరుకోసమో తప్పా.. కాపుల కోసం నిస్వార్థంగా పోరాడనన్న పేరును ముద్రగడ కొనితెచ్చుకుంటున్నారు. అందుకే ఇటీవలి కాలంలో కాపుసంఘాలు కానీ, కాపు నాయకులు కానీ ఆయనను కలుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కాపు రిజర్వేషన్ల పోరాటనాయుకుడు ముద్రగడ పద్మనాభం ఎవరికీ కాకుండా పోతున్నారు. రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులు ఇరుక్కుపోవాలి తప్ప, మనమే ఇరుక్కుపోయి, ఊపిరాడని పరిస్థితి రాకూడదు. ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. ఆయన కాపురిజర్వేషన్లు కావాల్సిందే నంటున్నారు. కాపుజాతికి న్యాయం కావాల్సిందే అంటున్నారు. కానీ, ఇతర కులాలకు కాపుకాస్తున్నారు. కాపు రిజర్వేషన్లనేవి రాజకీయ డిమాండ్. దాన్ని కాపునేతలు అందరినీ కలుపుకునిపోయి సాధించాలి తప్ప, తనను వచ్చి కలిస్తేనే ముందుకు వస్తానన్న చందంగా ఇప్పుడు ముద్రగడ తీరు కనిపిస్తోంది.
ఒకవేళ పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తే.., ఆయనపై పోటీగా ముద్రగడను నిలిపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పేరు జాబితాలో వచ్చేవరకూ జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కూడా ముద్రగడ పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి పవన్ ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ పిఠాపురం నుంచి వంగా గీతను కాకుండా కాపు నాయకుడిగా పేరున్న ముద్రగడను నిలబెడితే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ టికెట్ ఇస్తే, పోటీ చేసేందుకు ముద్రగడ సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలూ కనిపిస్తున్నాయి.
ఆయన రాజకీయంగా కొన్నాళ్లు తెరమరుగై, మళ్లీ తెరపైకి వచ్చినా.. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన కోసం తలుపులు బార్లా తెరవలేదు. ఎందుకొచ్చిన గొడవ, ముద్రగడ పద్మనాభం లేకపోతే పార్టీ నడవదా? అనే ధోరణిలోనే ఉన్నాయి. కానీ, ముద్రగడ మాత్రం ఏ పార్టీ టికెట్ ఇస్తే .. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు గతం నుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపులకు అధికారం, కాపుజాతి ఐక్యత కోసం గతంలో ఉద్యమాలు చేసిన ముద్రగడ ఇప్పుడు రెడ్ల పార్టీగా పేరున్న వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడంపై కాపుల్లోని ఓ వర్గం మండిపడుతోంది. ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే.. అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్లను అమలుచేస్తామని వైసీపీతో ఎన్నికల ప్రణాళికలో పెట్టించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రకటించిన కాపు రిజర్వేషన్లను రద్దుచేసిన ఘనత జగన్ కు ఉంది. అయినా ఇప్పుడు ఆపార్టీని కాపుకాసేలా ముద్రగడ నిర్ణయాలు ఉన్నాయి. వైసీపీలో చేరాలనుకుంటే, కాపు రిజర్వేషన్ల హామీతోనే ఆయన పార్టీలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE