టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వద్ద గల దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు చించినాడ పరిసర ప్రాంతంలోని దళితుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, నిలదీసిన దళితులపై దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సమస్యలపై సత్వరమే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారని లేఖలో టీడీపీ అధినేత ఆరోపించారు.
ఇంకా లేఖలో చంద్రబాబు ఇలా తెలిపారు.. యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో తమకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని, అయితే వైసీపీ నేతల ముఖ్య అనుచరులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. ఇక ఈ తవ్వకాలను నిరసిస్తూ ఈ నెల 6న చించినాడ దళితులు నిరసనలకు దిగగా, పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారని, ఈ సందర్భంగా తీవ్ర గాయాలు అయిన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై (సీఎం జగన్) ఉందని, బాధితులకు తగిన న్యాయం చేయాలనీ లేఖల్లో చంద్రబాబు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY