ప్రజాసమస్యలపై చేసే పోరాటంలో భాగంగా బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దని జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ప్రజా సమస్యల పరిష్కారం, పోరాటం కోసం ఇతర రాజకీయ పక్షాలతో కలసి ముందుకు వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు జనసేన పార్టీకి మిత్ర పక్షమైన భారతీయ జనతా పార్టీతో కలసి ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరోసారి తెలియచేస్తున్నానని” పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ లోని కొన్నిప్రాంతాలలో కలసి పని చేయడానికి బి.జె.పి. యేతర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయని పార్టీ నాయకులు కొందరు పార్టీ దృష్టికి తరచూ తీసుకువస్తున్నారు. మీడియా ముఖంగా మరోసారి విశదీకరిస్తున్నా, మనం బి.జె.పి.తో కలసి పని చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోనూ, పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక అవగాహనతో మన ఉభయ పక్షాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా రాజకీయ కూటమితో కలిసి పనిచేయమని ఎవరి నుంచైనా ఆహ్వానం అందినప్పుడు మనతో పాటు బి.జె.పి. కూడా ఆ కూటమిలో భాగస్వామి అయినప్పుడు మాత్రమే మీరు ఆయా కూటమిలతో కలసి పని చేయండి. బి.జె.పి. లేని కూటమితో భాగస్వాములు కావద్దని మరోసారి స్పష్టం చేస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu