ఉపాధ్యాయ దినోత్సవం శుభవేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని మన సమాజంతోపాటు నేను విశ్వసిస్తాను. ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితో పాటు శ్రీ సర్వేపల్లిని గౌరవించుకున్నట్లే. ఆయన మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన భాగ్యం. వేద కాలం నుంచి భారతదేశంలో గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారని, నెల్లూరులో నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ నా బాల్య స్నేహితుల ద్వారా తన యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారని, అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గురువులు చెప్పిన మాటలు, బోధించిన పాఠాలు గుర్తుకు వస్తుంటాయని, తల్లిదండ్రుల తరువాత గురువుల వద్దే అవాజ్యమైన వాత్సల్యం మనసును స్పర్శిస్తుందన్నారు. అటువంటి దైవ స్వరూపులైన గురువులందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళావిహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం బాధ కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY