ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభం కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. 85 గేట్లతో సహా 1195 మీటర్ల పొడవుతో సంగం బ్యారేజీ, రోడ్ కమ్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మూడేళ్లలో రూ.131.12 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజ్ ను సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే 51 గేట్లతో సహా నెల్లూరు బ్యారేజ్ నిర్మాణం, బ్యారేజ్కు అనుబంధంగా రెండువరుసలతో రోడ్ బ్రిడ్జి కూడా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6, మంగళవారం సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
సంగం బ్యారేజ్ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాలో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు కలిపి మొత్తం 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించడానికి ఈ బ్యారేజ్ దోహదపడుతుంది. బ్యారేజ్లో 0.45 టీఎంసీలను నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడం వల్ల తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. సంగం–పొదలకూరు మండలాల ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా లభించనుంది. ఇక దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్మారకార్ధం ఈ ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు నెల్లూరు బ్యారేజ్ ను కూడా రేపు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడురు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లో 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్దిగా నీటిని సరఫరా చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ బ్యారేజ్ను పూర్తి చేసి, 0.4 టీఎంసీలను నిత్యం నిల్వ చేయడం ద్వారా నెల్లూరు నగరంతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం లభించింది. ఈ బ్యారేజ్ను పూర్తి చేయడం ద్వారా సమర్థవంతంగా వరదను నియంత్రించి, నెల్లూరుతోపాటు బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు బారి నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ రెండు వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు–కోవూరుల మధ్య రవాణా సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY