తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో కూడా సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్ లోని కుర్చీలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డిని సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్, అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
ఈ పర్యటనలో ముందుగా బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సీఎం కేసీఆర్ నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎల్లమ్మగుట్టలోని నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు ప్రాంగణంలో సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆఫీసు లోపల సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిని సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్షుడు సీట్లో బెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY