రాజమండ్రి రూరల్ సీటుపై పొలిటికల్ రగడ జరుగుతోంది. రాజమండ్రి రూరల్ సీటు తనదేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అంటుండగా.. కాదు పవన్ కల్యాణ్ తనకు మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ చెప్పడంతో రాజకీయ కాక రేగుతోంది. నిజానికి పవన్ రాజమండ్రి టూర్ తర్వాత రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది సీన్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీటు మరింత హీటును పెంచింది.
రాజమండ్రి రూరల్ను టీడీపీ కంచుకోటగా చెప్పుకుంటారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని సృష్టించిన సమయంలోనూ.. టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటిగా తెలుగు తమ్ముళ్లు చెబుతారు. అప్పటి నుంచీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. తాజాగా టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి సీటుపై.. రెండు పార్టీల నేతలు ఆశలు పెంచుకున్నారు.
అయితే పవన్ కల్యాణ్ రాజమండ్రి టూర్లో .. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అని పవన్ క్లారిటీ ఇచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు. తనను పవన్ రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేయమని ఆదేశించినట్లు కందుల దుర్గేష్ తెలిపారు. ఇలా జనసేన, టీడీపీ మధ్య చిచ్చు రగులుతున్న సమయంలోనే రాజమండ్రి రూరల్ సీటుపై తాజాగా బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. రూరల్ సీటుపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని గోరంట్ల ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో కచ్చితంగా రూరల్ సీటు నుంచి తాను పోటీలో ఉంటానని చెప్పుకొచ్చారు.
దీంతో రాజమండ్రి రూరల్లో పోటీ చేసేది జనసేనా? లేక టీడీపీనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బరిలో బుచ్చయ్య చౌదరి నిలబడతారా? లేక కందుల దుర్గేష్ పోటీ చేస్తారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు తన సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి చంద్రబాబును కలవడానికి గోరంట్ల ప్రయత్నిస్తున్నారట.మరి ఈ ఎన్నికలలో ఎవరు నిలబడతారు? సీటు రాని వారిని ఆ పార్టీ అధినేత ఎలా బుజ్జగిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పొత్తుల లెక్కలు తేలకముందే ఇలా రెండు పార్టీల నేతలు రోడ్డెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF