కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అలియాస్ కేసీఆర్.. ఆ పేరుకు తెలంగాణలో ఓ చరిత్ర ఉంది. ఉద్యమనేతగా గుర్తింపు ఉంది. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. కానీ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం.. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. లోక్సభ ఎన్నికల వేళ మరోసారి సత్తా చాటేందుకు రణరంగంలోకి దిగారు. తనదైన వాక్చాతుర్యంతో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రెండురోజుల క్రితం కాంగ్రెస్ సర్కారుపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ లిల్లీఫుట్ సర్కార్ ఎంతో కాలం ఉండదని, ఏమో.. రేవంత్ రెడ్డే బీజేపీలోకి వెళ్లిపోవచ్చుఏమో.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ లో మళ్లీ ఊపు తీసుకొచ్చారు. ఇదే స్పీడులో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈక్రమంలోనే నేడు టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు బీఫాంలు అందజేసి యుద్ధానికి సిద్ధం చేయనున్నారు. అలాగే.. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. అంతేకాకుండా.., తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై నేడు పార్టీ నేతలతో చర్చించనున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. ఈసభల్లో ప్రధానంగా కాంగ్రెస్ లక్ష్యంగా మరోసారి కేసీఆర్ గర్జించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY