ప్రపంచంలో తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఏర్పడడం చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు ఆయన సతీమణి, ఏపీ తెలుగు అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ఈ సందర్భంగా విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఉదయం సీఎం జగన్ ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వాటిలో ఎన్టీఆర్ పేరుతో విజయవాడ జిల్లాను కూడా ఏర్పాటుచేశారు. సీఎం జిల్లాల ప్రకటన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చిన లక్ష్మీపార్వతి, కొత్త కలెక్టర్ ఢిల్లీరావుకు శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరితలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన పార్టీ కాకున్నా, ఎన్టీఆర్తో పరిచయం లేకపోయినా కూడా సీఎం జగన్ కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని ప్రశంసించారు. అలాగే తెలుగువారైన అల్లూరి సీతారామరాజు, సత్య సాయిబాబా, అన్నమయ్య వంటి మహనీయుల పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ అంశమని, ఆ మహానుభావుల ఆశీస్సులు సీఎం జగన్ కు లభిస్తాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పుట్టింది గుడివాడ దగ్గర నిమ్మకూరైనా, ఆయన బాల్యమంతా గడిచింది విజయవాడలోనేనని తెలిపారు. ఆ విధంగా విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు మరింత గుర్తింపునిచ్చారన్నారు. ఎన్టీఆర్ హిందూపూరం, టెక్కలి వంటి ఇతర ప్రాంతాల్లో కూడా పోటీ చేశారని, గెలుపొందారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ