ఏపీలో ఎన్నికలవేళ దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి అయిదా జాబితాలను ప్రకటించింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా త్వరలోనే అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన నుంచి అభ్యర్థుల సంబంధించి కొన్ని లీకులు వస్తుండగా.. అతిత్వరలోనే పూర్తిస్థాయి జాబితా వెలువడనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో విజయనగరం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈసారి కూడా పాత ప్రత్యర్థులే బరిలోకి దిగనున్నారట.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు బరిలోకి దిగారు. అటు వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేశారు. ఇద్దరి మధ్య రసవత్తరంగా సాగిన పోరులో చివరికి వీరభద్రస్వామి గెలుపొందారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన అదితి గజపతిరాజు ఓటమిపాలయ్యారు. అంతకంటే ముందు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అశోక్ గజపతిరాజు.. కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు.
ప్రస్తుతం పెద్ద ఎత్తున సిట్టింగ్లను మారుస్తూ వస్తోన్న జగన్.. విజయనగరం నుంచి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్లనే బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారట. పదేళ్లపాలనలో కోలగట్ల ఎక్కడా నెగిటీవ్ మార్క్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే నియోజకవర్గంలో ఆయనకు ప్రజాబలం కూడా బాగానే ఉంది. అంతేకాకుండా విజయనగరంలో అధికంగా ఉండే కాపులు కూడా కోలగట్ల వైపే ఉన్నారట. అందుకే ఈసారి కూడా ఆయన్నే విజయనగరం నుంచి బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.
అటు 2019లో కోలగట్ల చేతిలో ఓటమిపాలయిన అదితి గజపతిరాజు.. ఐదేళ్లలో పుంజుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలకు దగ్గరగా ఉంటూ.. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు నియోజకవర్గంలో అదితి వర్గం కూడా పెరిగిపోయింది. అటు టీడీపీ కూడా నియోజకవర్గంలో పుంజుకుంది. ఈక్రమంలో మరోసారి అదితికే విజయనగరం టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ఈసారి విజయనగరంలో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ