ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోంది. జులై 10 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ కి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంది ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. డిగ్రీ, పి.జి., ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయిపోయాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి కరోనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు ఎంతమాత్రమూ అంగీకరించలేదు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడానికి మేము ఎటువంటి పరిస్థితులలో అంగీకరించమని హైకోర్టు ఖరాకండిగా తెలిపింది. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు ఆధారంగా ఉత్తీర్ణతను ఖరారు చేసిందని” పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 6 వేలకు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. పరీక్షా కేంద్రాలకు పిల్లలను తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోంది. ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాలా తక్కువగా వుంది. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరవాతే ఇటువంటి డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము. ప్రభుత్వం విజ్ఞతతో పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu