జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై పవన్ కళ్యాణ్ ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. విశాఖలో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యచరణ తదితర అంశాల మీద ఇరువురు నాయకులు గంటన్నరకు పైగా చర్చించారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని, ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో పాటు రాజకీయ పార్టీలుగా ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలనే అంశం మీద ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ముందుగా రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే గొంతు నొక్కేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనీ, వీటిపై కలసికట్టుగా పోరాటం, చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇప్పటి నుంచి వైసీపీపై పోరాటం చేసే వ్యూహాలు మార్చబోతున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
విశాఖలో జనసైనికుల మీద అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఫోన్ ద్వారా మద్దతు తెలిపారని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఈ రోజు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వచ్చి మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎవరేం చేసినా ఆగేది లేదు. కచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలిచేందుకు ప్రజల్లోకి వెళ్తూనే ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు.
ముందుగా చంద్రబాబు మాట్లాడుతూ, “ఇటీవల విశాఖలో పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వం వాళ్లు ప్రవర్తించిన తీరు పట్ల ఆవేదన కలిగి వారిని కలసి సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. విమానాశ్రయం నుంచి వస్తుండగా ఆయన ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. విశాఖలో జరిగిన ఘటనల క్రమం చూస్తే మనం ఒక నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ముందుగా ప్రకటించిన కార్యక్రమం కోసమే పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లారు. రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టుకోవాలంటే, పోలీసులు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. అది పోలీసులు బాధ్యత. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఒకే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇద్దరు ఎదురుకాకుండా పోలీసులే ప్లాన్ చేస్తారు. అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్తే దారుణంగా ప్రవర్తించారు” అని అన్నారు.
ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదని, రాజకీయ పార్టీలే లేకపోతే ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేస్తారని ప్రశ్నించారు. ముందుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కలసి పోరాటం చేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుదాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడుదాం. ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ఎవరికి ఓట్లు వేయాలన్న విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. రాజకీయ పార్టీల పరిస్థితే ఇలా ఉంటే ప్రభుత్వం తప్పు చేస్తుందన్న విషయం ఎవరికి చెప్పాలి. ముందుగా మనం కార్యక్రమాలు చేయగలిగితే రాజకీయ పార్టీలుగా ఎలా పోటీ చేయాలి అనే అంశం వారే నిర్ణయించుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం కొనసాగుతుంది అని చంద్రబాబు అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY