ఎన్నో ప్రశ్నలు, మరెన్నీ అనుమానాలు, అంతకు మించి అనుక్షణం ఉత్కంఠ.. ఏ క్షణం టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఎలాంటి తీర్పు చెబుతారా అని రెండు తెలుగు రాష్ట్రాలు టెన్షన్గా ఎదురు చూశాయి. అనుకున్నట్లుగానే రెండు రోజులు నుంచి జరుగుతున్న పొలిటికల్ డ్రామాకు ఏసీబీ హైకోర్టు తెరదించేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలినట్లయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి గట్టి షాకే ఇచ్చింది. సెప్టెంబర్ 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో.. పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.
అయితే అంతకు ముందు సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో .. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు .. మొత్తం 16 సెక్షన్ల కింది బాబుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నంద్యాల నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకువెళ్లి .. సిట్ ఆఫీసులో దాదాపు నాలుగు గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి గంట సేపు పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకుని వెళ్లకుండా.. మళ్లీ సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించి భారీ భద్రత మద్య ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిధ్ధార్థ్ లూద్రా వాదించగా.. అదనపు ఏజీ పొన్నవోలు ప్రభాకర్ రెడ్డి సీఐడీ తరుఫున వాదనలు వినిపించారు. ఈ సమయంలో 15 రోజుల పాటు చంద్రబాబును జుడీషియల్ రిమాండ్కు ఇవ్వాలని కోర్టును సీఐడీ అధికారులు కోరారు. అయితే సిద్ధార్థ్ లూద్రా కంటే ముందు కోర్టులో చంద్రబాబు స్వయంగా తన వాదనలను జడ్జి ముందు వినిపించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని..స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు.2015-16 బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ను పొందుపరిచామని.. రాష్ట్ర అసెంబ్లీ కూడా దానికి ఆమోదించిందని వివరించారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు చంద్రబాబు.
ఆ తర్వాత చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా ..కోర్టుకు వాదనలు వినిపించారు. సరైన సాక్షాధారాలు లేకుండా ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని కోర్టుకు వివరించారు.ఆ సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్షాలు చూపించాలని అన్నారు. ఇలా సెప్టెంబర్ 10 అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఏసీబీ కోర్టు వాదనలు కొనసాగాయి.
ఆరున్నర గంటల పాటు రెండు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు కొనసాగగా..వాదనలు పూర్తయిన తర్వాత జడ్జి చంద్రబాబు కేసులో తీర్పును రిజర్వులో ఉంచారు. ఆ తర్వాత రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు తుది తీర్పు వెల్లడించిన జడ్జి .. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దీంతో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కేసులోనూ ఆయన అరెస్టు కాలేదు.రిమాండ్కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు స్కిల్ డెవెలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో పాటు ఏకంగా రిమాండ్కే వెళ్లడం సంచలంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE