ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి కంటిమీద కునుకు దూరం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోవడంతో సీఎం జగన్ తెగ టెన్షన్ పడుతున్నారట. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీని 151 స్థానాలలో గెలిపించుకోవడం కోసం జగన్ చాలా కష్టపడ్డారు. మంగళగిరి నుంచి టీడీపీ నుంచి బరిలో దిగి లోకేశ్ , గాజువాకతో పాటు భీమవరం నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించడంలో జగన్ వ్యూహం వర్కౌట్ అయింది.
2024లో మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో లోకేశ్ మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి..తెలుగుదేశం పార్టీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.
పవన్, లోకేష్, రఘురామ ..ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా కూడా వైసీపీ అధినేతకి, ఆ పార్టీలోని కొంతమంది నేతలకు చుక్కలే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్, రఘురామ కృష్ణరాజు, లోకేష్ టార్గెట్ గా వైసీపీ నాయకులు చాలా సందర్భాల్లో..హద్దులు దాటి మరీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు కూడా ఈ ముగ్గురినీ ఓడించడం కోసం అధికార వైఎస్సార్సీపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీకి స్థానికంగా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవట. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని..కాకపోతే మెజార్టీ ఎంతో మాత్రం చెప్పలేమని చాలా సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు కనీసం 50 వేల మెజార్టీతో జనసేనానిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ కు వ్యతిరేకంగా ముద్రగడ, వంగా గీతా వంటి కాపు నేతలను రంగంలోకి దించినా కూడా ఓటర్లంతా పవన్ వైపే ఉన్నట్లు సర్వేలు ప్రకటిస్తున్నాయి.
అందుకే ఇప్పటికే మంగళగిరిలో వైఎస్సార్సీపీ చేతులెత్తేస్తోందట. ఎందుకంటే వైఎస్సార్సీపీ అంతర్గత సర్వేలు కూడా మంగళగిరిలో లోకేశ్ గెలవడం ఖాయమని తేల్చి చెప్పాయట. ఇప్పుడు లోకేష్ ను ఓడించడానికి వైసీపీ ఇప్పటి వరకూ మంగళగిరిలో ముగ్గురు అభ్యర్థులను మార్చింది. అయినా ఫలితాలు మాత్రం లోకేష్ కు అనుకూలంగా చూపించడంతో అధిష్టానం షాక్ అవుతుందట. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రజలకు దగ్గరయ్యే పనులు చేయడంలో లోకేష్ సక్సెస్ అవ్వడమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఈ సారి తెలుగు దేశం పార్టీ తరపున ఉండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘురామ కృష్ణరాజు కూడా గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రఘురామ ఎమ్మెల్యేగా గెలిచి కూటమి అధికారంలోకి రాగానే.. స్పీకర్ అవుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో పవన్, రఘురామ కృష్ణరాజు , లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలిస్తే మాత్రం వైఎస్సార్సీపీకి ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ