ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేవారిలో సీనియర్ నేతలయిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్రెడ్డి పేర్లను సీఎం జగన్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో.. ఈ నెల 8న ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించడానికి వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం చూస్తే.. 3 స్థానాలను కూడా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ అభ్యర్థిని బరిలో నిలపడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సర్వేలతో పాటు..మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఇప్పుడు టీడీపీ పోటీ చేయడానికి ఇది సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీలో ఇప్పటికీ టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్నఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనే ఆలోచనతో తమ అభ్యర్థిని చంద్రబాబు బరిలో నిలుపుతోంది. మొత్తంగా గత ఎన్నికలలోలాగే ఇప్పుడు కూడా టీడీపీ క్రాస్ ఓటింగ్పైన ఆశలు పెట్టుకుంది.
ఇప్పుడు ఎన్నికలు జరుగబోతున్న 3 రాజ్యసభ స్థానాలలో ఒక్కో సీటుకు 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరిగా ఉండాలి. 3 స్థానాలు గెలవాలంటే 132 మంది ఎమ్మెల్యేలు అవసరం పడుతుంది. వైసీపీకి ఇంతకు మించిన బలం ఉన్నా కూడా వీరిలో సుమారు 25 మంది టికెట్ దక్కని వారు ఉన్నారు. ఈ అసంతృప్త నేతలలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారనే సందేహం వైసీపీ వర్గాలలోనూ ఉంది.
మరోవైపు ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. అలా టీడీపీ,జనసేన, వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక్కో ఎంపీకి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటు రాజ్యసభలో ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ పదవీకాలం ముగుస్తుంది. ఈ స్థానాలకే ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికల కోసం రేపు అంటే ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 వరకూ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగగా.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయ్యాక కౌంటింగ్ చేసి అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE