ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణికి ‘లోక్నాయక్’ పురస్కారం దక్కింది. ఈ మేరకు ఆయన ఈ ఏడాది లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారానికి ఎంపికైనట్లు అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నం ఏయూలోని హిందీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాజీ ముఖ్యమంత్రి, దివంగత అగ్ర నటుడు ఎన్టీఆర్ మరియు ప్రముఖ హిందీ రచయిత హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి రోజైన జనవరి 18న లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేస్తుంటామని, అయితే ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. కాగా తెలుగు భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందిస్తామని లక్ష్మీప్రసాద్ వివరించారు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో తనికెళ్ల భరణికి లోక్నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. అలాగే పురస్కారంతో పాటు రూ.2 లక్షల నగదు అందజేయనున్నట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆయన దివంగతులు అయ్యే వరకు సేవలందించిన ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్కు కూడా ఆత్మీయ సత్కారం చేసి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నగదు అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సినీ నటుడు మోహన్ బాబు, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొననున్నట్లు లక్ష్మీప్రసాద్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ