ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. విజయవాడలోని జీజీహెచ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించి, సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో తోలి కరోనా వ్యాక్సిన్ ను వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారికి ఇచ్చారు. శనివారం నాడు 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక్కోకేంద్రం వద్ద 100 మందికి చొప్పున తోలిరోజున 33,200 మందికి వ్యాక్సిన్ అందజేయనున్నారు.
తొలివిడతలో మొత్తం 3.87 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కార్యక్రమం సుమారు 15 రోజుల పాటు కొనసాగనుంది. మొదటి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు పంపిణీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీకి ఇప్పటికే 4.7 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు, 20 వేల కోవాక్సిన్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 332 కేంద్రాల్లో 2324 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ సందర్భంగా ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే సత్వరమే చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఇతరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ