గుంటూరుజిల్లా పొన్నూరులో రైతుల పొలాల్లో నీళ్లు లేవు కానీ.. ఐదేళ్లుగా కళ్లల్లో మాత్రం కన్నీళ్లే. కనీసం ఒక్క ఏడాదిలో కూడా పూర్తి పంట ఇంటికి తీసుకెళ్లలేకపోయారు. నీటి సమస్య.. విద్యుత్ సమస్య.. ప్రకృతి విపత్తులు.. ఇలా కారణాలు ఏదైనా పొన్నూరు రైతులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. వర్షాలు కురవకపోతే కరువు.. కురిస్తే.. ముంపు.. ఇదీ స్థూలంగా.. పొన్నూరు నియోజకవర్గంలోని దుస్థితి. రైతుల పక్షపాతి అని.. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వేలాది రూపాయలు జమ చేస్తున్నామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. పొన్నూరు రైతుల గోసను ఎన్నడూ చూసింది లేదు.. విన్నదీ లేదని అక్కడి రైతులు వాపోతున్నారు. ఈ నియోజకవర్గంలోని పొలాలకు నీటి లభ్యత అంతంత మాత్రమే. పోలవరం పూర్తయితే ఈ నియోజకవర్గానికి మేలు జరిగే అవకాశం ఉన్నా.. వైసీపీ ప్రభుత్వం ఆదిశగా దృష్టి సారించలేదు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడి రైతుల కష్టాలు తొలగించేందుకు, ఈ ప్రాంతంలోని పంటలను కాపాడడానికి తొలి విడతలోనే 53 కోట్ల రూపాయలతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసింది. వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదు. ఫలితంగా రైతుల పంటలు సరిగా పండడం లేదు. పంట కాల్వలు మూసుకుపోవడం.., ప్రభుత్వానికి పూడికతీత పట్టకపోవడం కారణంగా.. చిన్నపాటి వర్షం వచ్చినా పంటలు మునిగిపోతున్నాయి. నీటి లభ్యత సరిగా లేని కారణంగా.. ఒకప్పుడు 35 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చే స్థితి నుంచి., ఇప్పుడు 20 నుంచి 25 బస్తాలు రావడం కూడా గగనంగా మారింది. వర్షాలు సరిగా కురవకపోతే.. ఇక్కడ కరువు విలయతాండవం చేస్తుంది. ఈ ప్రాంతంలో సాగు అభివృద్ధికి నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. అందుకు పోలవరమే ఆధారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై అనిశ్చితి ఏర్పడిన కారణంగా.. రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
మరోవైపు పండిన పంటకు గిట్టుబాట ధర లేదు. అమ్మిన పంట డబ్బులు సమయానికి రావడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంట అమ్మిన 21 రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో పడేవి. వైసీపీ హయాంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఉంది. కొన్నిసార్లు రెండు, మూడు నెలల సమయం కూడా పడుతోంది. బమోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదని, ఆధార్, సెల్ఫోన్ నంబర్ లింకులు లేవని.. రకరకాల కారణాలతో డబ్బుల అందజేతలో జాప్యం జరుగుతోంది. మరోవైపు సకాలంలో ధాన్యం సేకరణ జరగకపోవడం.. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం వల్ల రైతులు అప్పులపాలవుతున్నారు.
మరోవైపు కరెంట్ కోతలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. వ్యవసాయ సర్వీసులకూ గంటనుంచి రెండు గంటలపాటు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. 9 గంటలు ఇస్తున్నామని చెబుతూ.. 5 గంటలే ఇస్తోంది.. అందులోనూ పది సార్లు కోతలు ఉంటున్నాయి. రాత్రంతా కాపుకాసినా.. ఎకరా పొలం కూడా తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో గంట నుంచి రెండు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నా ఫ్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అంతేకాదు.. తుఫాను సమయంలో ముందస్తు హెచ్చరికలు లేని కారణంగా కూడా రైతులు నష్టపోతున్నారు. చావాలో.. బతకాలో.. అర్థం కాక ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసినా సకాలంలో అందక అన్నదాత అర్థాకలితో బతకాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. గత తుఫాను సమయంలో ముంపు రైతుల కష్టాలు విని చలించిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. కొందరికి అక్కడికక్కడే 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
శనగపంట రైతులకూ కష్టాలు తప్పడం లేదు. ఎకరాకు 30 వేల రూపాయల నుంచి 40 వేల పెట్టుబడి పెట్టి పండించే రైతుల నుంచి పంట సేకరించడం లేదు. ఈకాప్ లో రిజిస్టర్ అయినా ఫోన్ చేసి రైతులను పిలిచేందుకు రోజుల తరబడి జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేక పంట కొనడం లేదని అధికారులు తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు. అంతేకాదు.. పండించిన పంటలో పది నుంచి 12 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయమై పెదనండిపాడు మార్కెట్ యార్డులో పలుమార్లు రైతులు ఆందోళనలు చేపట్టారు. రైతులు ధాన్యం అమ్మడానికి అవసరమైన గోతాల విషయంలోనూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోయారు.
గుంటూరు జిల్లా పొన్నూరు సంపెంగ పూల సువాసనలతో గుభాళిస్తున్నా ఆ వాసనను వాటిని పండించే రైతు ఆస్వాదించలేకపోతున్నాడు. పొన్నూరు మండలంలోని అనేక ప్రాంతాల్లో రైతులు సంపెంగ సాగు చేస్తున్నారు. వేసవిలో పైర గాలికి సంపెంగపూలు విరగకాసి కిలోమీటరు దూరం వరకు సువాసనలు వెదజల్లేవి. ఈసారి ఆ గుబాళింపులు రావడం లేదు. ఇక్కడి నుంచి సంపెంగ పూలు ప్రతిరోజూ గుంటూరు, విజయవాడ, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాలకు వెళుతుంటాయి. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ వీరాంజనేయస్వామి వార్లకు భక్తులు సంపెంగ పూలతో నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రభుత్వ సహకారం కరువై.. రైతులు ప్రత్యామ్నయాలను చూసుకుంటున్నారు. సీజన్ లో ఒక్కో చెట్టుకు 100 పూలు మాత్రమే పూస్తాయని, వీటిని అమ్ముకోగా వచ్చే డబ్బులు తోటలకు ఆకుతడి పెట్టడానికి కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే.. కరోనా సమయంలో కాపూరి రకం తమలపాకుల సాగు పండించిన రైతుల పడిన కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఎగుమతి చేయకపోవడం వల్ల కొంతమంది రైతులు ఆకులు కోసి అక్కడే పారబోసేశారు. లక్షల పెట్టుబడితో సాగుచేసిన పంట…కళ్ల ముందే ముదిరిపోతోంది అంటూ.. ఆనాడు రైతులు పడిన గోస నేటికీ వినిపిస్తూనే ఉంటుంది. వీరే కాదు.. మొక్కజొన్న, తెల్లజొన్న, అపరాల సాగు.. ఇలా ఏ పంట పండించినా రైతు.. ఏ ఒక్క ఏడాది కూడా పూర్తి పంట సంతోషంగా ఇంటికి తీసుకెళ్లింది లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE