ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోటాపోటీగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈక్రమంలో కొద్దరు సీనియర్లను కూడా పక్కకు పెట్టేందుకు పార్టీలు వెనుకాడడం లేదు. ఈక్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఈసారి షాక్ తప్పదా అంటే.. ప్రస్తుతం పరిస్థితులు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి బరిలోకి దిగేందుకు దేవినేని సిద్ధమవుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మైలవరం నుంచి మరో నేతను పోటీ చేయించాలని అనుకుంటున్నారట.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్మున్న నేతగా ఎదిగిన దేవినేని ఉమామహేశ్వరరావు 1999లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి దేవినేని గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మైలవరానికి వెళ్లారు. అక్కడి నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2014 లో గెలుపొందిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా మైలవరం టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు దేవినేని. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటూ.. ప్రచారం కూడా నిర్వహిస్తున్నారట. అయితే అటు హైకమాండ్ చేపట్టిన సర్వేలో దేవినేనికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని.. ప్రజాబలం కూడా తగ్గిపోయిందని తేలిందట. ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో స్పష్టమయిందట. అలాగే సొంత పార్టీ నేతలే దేవినేనికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని పట్టుపడుతున్నారట.
గత ఎన్నికల్లో మైలవరం నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా త్వరలో టీడీపీ గూటికి రానున్నారు. ఆయన కూడా మైలవరం టికెట్ ఆశిస్తున్నారట. అసలు మైలవరం టికెట్ హామీతోనే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. మరోవైపు మైలవరంకు చెందిన టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా ఈసారి మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన టికెట్ కోసం తీవ్రంగా కష్టపడినప్పటికీ హైకమాండ్ ఆయనను పక్కకు పెట్టింది. ఈక్రమంలో ఈసారి అయినా తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట.
ఈ పరిణామాల మధ్య దేవినేని ఉమాకు స్థానచలనం కల్పించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. మరో చోటు నుంచి ఆయన్ను పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఈ మేరకు పెనమలూరు నుంచి దేవినేని బరిలోకి దించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. ఇదే విషయంపై ఇప్పటికే చంద్రబాబు దేవినేనితో చర్చలు జరిపారట. అటు దేవినేని మాత్రం తాను మైలవరం నుంచి కదిలేది లేదని.. అక్కడి నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారట. చంద్రబాబు మాత్రం ఎలాగైనా దేవినేనిని సైడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY