ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. క్రమక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో మాజీలను తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ షర్మిల ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణతో సమావేశమయ్యారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కొణతాల రామకృష్ణ.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ను కూడా రామకృష్ణ కలిశారు. పార్టీలో చేరిక, త్వరలో జరగబోయే ఎన్నికలు ఇతర అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత తన నియోజకవర్గంతో కీలక నేతలు, కేడర్, అభిమానులతో కూడా రామకృష్ణా సమావేశమయ్యారు. జనసేనలో చేరికపై వారితో చర్చలు జరిపి.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
అయితే జనసేనలో చేరుతానని కొణతాల ప్రకటించినప్పటికీ.. ఇంకా చేరకపోవడంతో వైఎస్ షర్మిల వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. గతంలో కూడా షర్మిల.. కొణతాలకు ఫోన్ చేశారు. తిరిగి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. కానీ అప్పట్లో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా లేనని చెప్పేశారు. ఈక్రమంలో మంగళవారం స్వయంగా షర్మిల కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. కొణతాలను షర్మిల మరోసారి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పలు ఆఫర్లు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే కొణతాల మాత్రం మనసు మార్చుకునే ఆలోచణలో లేరట. జనసేనలోనే చేరాలని అనుకుంటున్నారట. అటు తన అభిమానులు కూడా జనసేనలోనే చేరాలని అంటున్నారట. జనసేన-టీడీపీ కూటమి వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారట. మరి స్వయంగా షర్మిల ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో కొణతాల ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ