ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. మారిన రాజకీయ సమీకరణాలతో పొలిటికల్ స్ట్రీట్ రోజురోజుకు హీటెక్కుతోంది. అధికార వైఎస్సాసీపీ రెండోసారి పవర్లోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. వైసీపీని ఓడించడానికి ఎన్ని పొత్తులకైనా, ఎత్తులకైనా రెడీ అంటూ టీడీపీ, జనసేన కలిసికట్టుగా నడుస్తున్నాయి.
ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి అగ్నిపరీక్ష అనే చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే జనసేనతో జత కట్టి..ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతా ఓకే అయి ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే మాత్రం.. వైసీపీ, ప్రతిపక్ష కూటమికి మధ్య మహా యుద్ధం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా చెప్పుకునే టెక్కలి నుంచి తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అచ్చెన్నాయుడని మెయిన్ టార్గెట్గా అనుకుంటున్న ఏపీ సీఎం జగన్..రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నను ఓడించాలనే లక్ష్యంతో దానికి తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టెక్కలి నియోజకవర్గంగా ఏర్పాటయ్యాక తొలిసారిగా 1952 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత తెలుగు దేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా కంచుకోటగా మారిపోయింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదుసార్లు విజయం సాధించగా.. టీడీపీ ఎనిమిదిసార్లు గెలిచింది. మధ్యలో జనతాపార్టీ, స్వతంత్ర పార్టీ చెరోసారి విజయం సాధించాయి. 1994 ఎన్నికల్లో టీడీపీని స్థాపించిన నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచి పోటీచేసి అఖండ విజయాన్ని సాధించారు.
ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత వరుసగా రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కూడా అచ్చెన్నే గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా విజయాన్ని సాధించి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఆయన ఉండగా.. ఎలాగైనా ఈ సారి అచ్చెన్నను ఓడించి అక్కడ తమ జెండా ఎగరేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 8,545 ఓట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే , 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పైన 8,387 ఓట్ల తేడాతో అచ్చెన్నాయుడు గెలుపొందారు. మరి ఈ సారి ఎన్నికలలో అచ్చెన్న హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంటారో.. వైసీపీ అచ్చెన్న స్పీడుకు బ్రేక్ వేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE