తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కరోనా థర్డ్వేవ్ ప్రారంభానికి సూచన అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. అలాగే, తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన చెప్పారు.
తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల సమయం మనకు ఎంతో కీలకమని ఆయన చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో అత్యధిక కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని, 10 శాతం మందికి మాత్రమే లక్షణాలు బయటపడుతున్నాయన్నారు. అయితే ఆ 10 శాతం మంది వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అయితే, అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి, వైద్యశాఖకు సహకరించాలని ఆయన కోరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదాని ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. కానీ, ఒమిక్రాన్ సుమారు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒమిక్రాన్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి కరోనా వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్కులు ధరించి ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ