ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. ఈ సంఘటన తర్వాత, ఆగ్రహించిన రైతులు మంత్రి కాన్వాయ్కు చెందిన వాహనాన్ని తగలబెట్టడంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు కూడా మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో స్థానిక జర్నలిస్ట్ గాయాలతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కాన్వాయ్ దూసుకెళ్లడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ముందుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కేశవ్ ప్రసాద్కు స్వాగతం పలికేందుకు అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనాలతో రాగా రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ లోని ఒక వాహనం రైతుల మీదుగా వెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రానే వాహనాన్ని నడుపుతున్నాడని రైతులు ఆరోపించారు. అయితే రైతుల మీదుగా తన కుమారుడు కారు నడిపించాడన్న ఆరోపణల్ని మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. ఘటన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని, దీనివెనుక ఎదో కుట్ర దాగి ఉందని చెప్పారు.
మరోవైపు ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలను వివరంగా పరిశీలిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ పరిస్థితుల్లో అందరూ శాంతిని కాపాడాలని యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. అలాగే మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖీమ్పూర్ ఖేరీలో ప్రవేశించడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో లఖీమ్పూర్ ఖేరీలో భారీ ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ