ఏసీసీ ఉమెన్స్ టీ20 ఆసియా కప్-2022 టైటిల్ ను భారత్ జట్టు గెలుచుకుంది. శనివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఘనవిజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుని భారత్ మహిళల జట్టు ఏడో సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. 2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022 సంవత్సరాల్లో టైటిల్ గెలుచుకుని ఆసియా కప్ లో భారత్ మహిళా జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే శ్రీలంక జట్టు చేతులెత్తేసింది. శ్రీలంక జట్టులో కేవలం ఇనోకా రణవీర (18), ఓషాది రణసింగె (13) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఓపెనర్లు అయిన వికెట్ కీపర్ అనుష్క సంజీవని (2), కెప్టెన్ చమరి ఆటపట్టు (6) రనౌట్లతో వెనుదిరగడంతోనే ఆ జట్టు పతనం మొదలైంది. భారత్ బౌలర్ల మెరుగైన ప్రదర్శనతో మిగతా లంక బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. భారత్ బౌలర్లతో రేణుకా సింగ్ ఠాకూర్ 3/5, రాజేశ్వరి గైక్వాడ్ 2/16, స్నేహ్ రాణా 2/13 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 66 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన భారత్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 8.3 ఓవర్లలోనే 71 పరుగులు చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ ఓపెనర్ స్మృతి మంధాన చేలరేగి ఆడుతూ, 25 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీతో (51) నాటౌట్ గా నిలిచింది. ముందుగా ఓపెనర్ షెఫాలీ వర్మ 8 బంతుల్లో 5 పరుగులతో, మూడోస్థానంలో వచ్చిన జెమియా రోడ్రిగ్స్ 4 బంతుల్లో 2 పరుగులతో పెవిలియన్ చేరారు. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (12) తో కలిసి, స్మృతి మంధాన జట్టుకు సునాయాసంగా విజయాన్ని అందించింది. 8 ఓవర్లో మూడో బంతిని స్మృతి మంధాన సిక్సర్ గా మలచడంతో విజయం ఖాయం కాగా, భారత్ జట్టులో, అభిమానుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఇక ఆసియా కప్ 2022లో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోగా, ఫైనల్ మ్యాచ్ కు గానూ రేణుకా సింగ్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY