టోక్యో ఒలింపిక్స్ లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అస్సాంకు చెందిన 23 ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటిసారే పతకాన్ని దక్కించుకుంది. గురువారం నాడు లవ్లీనా బొర్గోహెన్ గౌహతి చేరుకోగా, గౌహతి విమానాశ్రయంలో ఆమెకు స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వాగతం పలికారు. ఒలింపిక్స్ 2020లో లవ్లీనా సాధించిన విజయంతో ఒక బిలియన్ కలలకు ప్రేరణ కలిగించిందని, అలాగే ప్రపంచ స్థాయిలో పెద్దగా ఎదగాలని కోరుకునే గ్రామీణ ప్రాంతాలలోని క్రీడా ప్రతిభావంతులకు ఒక ఉదాహరణగా నిలిచిందని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.
కోటి నగదుతో పాటుగా డీఎస్పీ ఉద్యోగం:
అనంతరం అస్సాం నుంచి మొదటి ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న లవ్లీనా బొర్గోహెన్ కు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వశర్మ లవ్లీనాపై వరాల జల్లు కురిపించారు. లవ్లీనాను డీఎస్పీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఆమెకు కోటి రూపాయలు నగదు బహుమతితో పాటుగా పారిస్ ఒలింపిక్స్ వరకు నెలవారీగా లక్ష రూపాయల స్కాలర్షిప్ కూడా అందించనున్నట్టు తెలిపారు. అలాగే ఆమె స్వస్థలం అయిన సరూపథర్ లో స్థానిక యువత స్పోర్ట్స్లో రాణించడంలో సహాయపడటానికి 25 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు. గౌహతిలో ఒక రహదారికి లవ్లీనా పేరు పెట్టబడుతుందని, అలాగే ఆమె ఐదుగురు 5 కోచ్లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను నగదు బహుమతిని అందిస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ