బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ ఫాగు చౌహాన్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం రాజ్భవన్ వెలుపల నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ఆయన చెప్పారు.
కాగా లాలూ యాదవ్కు చెందిన ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వామపక్షాలు సహా కాంగ్రెస్లతో కూడిన ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి సమావేశం కూడా ముఖ్యమంత్రి నివాసానికి ఎదురుగా ఉన్న రబ్రీ దేవి ఇంట్లో జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలందరూ నితీశ్ కుమార్కు మద్దతు లేఖపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆయనకు తన మద్దతు లేఖను అందజేయడానికి సిఎం నివాసానికి వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్జేడీ మద్దతు ఇవ్వనున్న నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఆర్జేడీ బలం 79 కాగా జేడీయూ ఎమ్మెల్యేల సంఖ్య 45గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY