మేఘాలయ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎంపవర్ మేఘాలయ విజన్ డాక్యుమెంట్ 2023’ పేరుతో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు-2023 కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మేఘాలయ బీజేపీ నేతలు పాల్గొనగా, ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల కోసం బీజేపీ అనేక హామీలను పొందుపరిచింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, మేఘాలయ కోసం మేనిఫెస్టోను విడుదల చేయడం పట్ల సంతోషిస్తున్నానన్నారు. మేఘాలయ సంస్కృతి మరియు సంప్రదాయాలతో కూడిన గొప్ప రాష్ట్రం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి గొప్ప అవకాశం ఉందని మరియు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధి కోసం ఈశాన్య రాష్ట్రాల మధ్య పోటీ ఉంది మరియు మేఘాలయ కూడా దానిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ అవినీతి అనేది రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారింది. స్పీడ్, స్కేల్ మరియు స్కిల్ అనే మూడు అంశాలను బాగా నిర్వహించాలి. రాష్ట్రం కోసం పెద్దగా ఆలోచించాలి, మేము ‘మెగా మేఘాలయ’ కోసం ఆకాంక్షిస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 27వ తేదీన ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక మార్చి 2వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు-2023: బీజేపీ మేనిఫెస్టో లో ముఖ్యాంశాలు ఇవే…
- మేఘాలయలో 7వ వేతన సంఘం/పే కమిషన్ అమలు చేయాలని నిర్ణయం
- రైతుల ప్రయోజనం కోసం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వార్షిక ఆర్థిక సహాయాన్ని రూ.2,000 పెంచుతాము
- ఆడపిల్లల కోసం కొత్త కార్యక్రమం, ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.50,000 విలువైన బాండ్ను అందజేస్తాం
- విద్యార్థునులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
- ఉజ్వల యోజన లబ్ధిదారులకు సంవత్సరానికి 2 ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందిస్తాం
- యువత సాధికారత కోసం ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు, ఉపాధి అవకాశాలను నింపడానికి అనేక పారిశ్రామిక యూనిట్లు స్థాపన
- భూమిలేని రైతులకు వార్షిక ఆర్థిక సహాయం రూ.3,000
- మత్స్యకారులకు వార్షిక ఆర్థిక సహాయం రూ.6వేలు
- సీనియర్ సిటిజన్లకు పెన్షన్ రెట్టింపు
- రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి తల్లులకు సాధికారత కల్పించేందుకు ఏటా రూ.24,000 ఆర్థిక సహాయం
- అవినీతికి సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- మేఘాలయను శాంతియుత, అభివృద్ధి చెందిన, సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE