పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసన్సోల్ లోక్సభ, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలో మరియు మహారాష్ట్రలో నార్త్ కొల్హాపూర్, బీహార్ లో బోచాహన్, ఛత్తీస్ గడ్ లో ఖైరాఘర్ అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 12న ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో నేడు కౌంటింగ్ పక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మరోసారి బలంగా సత్తా చాటింది. అసన్సోల్ లోక్సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వెటరన్ నటుడు శత్రుఘ్న సిన్హా సమీప బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పై 3,03,209 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీఎంసీ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి బాబూలాల్ సుప్రియో సమీప సీపీఎం అభ్యర్థి సైరా షా హలీమ్ పై 20,228 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మహారాష్ట్రలో నార్త్ కొల్హాపూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్, బీజేపీ అభ్యర్థి సత్యజీత్ (నానా) కదమ్ పై 19,307 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీహార్ లోని బోచాహన్ స్థానంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ బీజేపీ అభ్యర్థి బేబీ కుమారిపై 36,653 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఛత్తీస్ గడ్ లో ఖైరాఘర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి యశోద నీలాంబర్ వర్మ, బీజేపీ అభ్యర్థి కోమల్ జంఘెల్ పై 20,176 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాలుగు రాష్ట్రాల్లోని ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
బెంగాల్లో టీఎంసీ అభ్యర్థుల విజయంపై పార్టీ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీ స్పందిస్తూ, ” టీఎంసీ పార్టీ అభ్యర్థులకు గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు అసన్సోల్ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు బల్లిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా-మతి-మనుష్ సంస్థకి ప్రజల శుభో నబర్షో కానుకగా భావిస్తున్నాము. మరోసారి మాపై నమ్మకం ఉంచినందుకు ఓటర్లకు వందనం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ