ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనం నిలిపిన కేసులో దర్యాప్తు పలు మలుపులు తీసుకుంటుంది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ సోమవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనిల్ దేశ్ముఖ్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. అనిల్ దేశ్ముఖ్ వివిధ దర్యాప్తుల్లో జోక్యం చేసుకున్నాడని, తనకు కావలసిన విధంగా దర్యాప్తు జరపాలని పోలీసు అధికారులను ఆదేశించాడని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా పరమ్బీర్ సింగ్ సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో పరమ్బీర్ సింగ్ తరపున వాదనలు వినిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే పిటిషన్ పై కోర్టులో విచారణ తేదీ ఇంకా నిర్ణయించబడలేదు.
ముందుగా ఓవైపు ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు బెదిరింపు కేసులో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతుండగా, ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ను మహరాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసి హోమ్ గార్డ్స్ డీజీ నియమించిన అనంతరం మరో మలుపు తీసుకుంది. బదిలీ అనంతరం పరమ్బీర్ సింగ్ హోమ్ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ముంబయిలోని పబ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర మార్గాల ద్వారా నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సచిన్ వాజేకు అనిల్ దేశ్ముఖ్ లక్ష్యంగా పెట్టారని సీఎంకు రాసిన లేఖలో పరమ్బీర్ సింగ్ పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు. పరమ్బీర్ సింగ్ లేఖతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు అనిల్ దేశ్ముఖ్ ఈ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరమ్బీర్ సింగ్ పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆ అంశంపై ఎన్సీపీతో పాటుగా, ప్రభుత్వంలో నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనిల్ దేశ్ముఖ్ ను మంత్రిగా కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దాంతో పాటుగా మహారాష్ట్రలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ