కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకి ఉధృతంగా మారుతుంది. గత రెండు నెలలుగా రైతుల ఉద్యమం ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. అయితే జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో చోటుచేసుకున్న హింస, ఉద్రిక్త పరిణామాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నాయి. సింఘు సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తున్న రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని స్థానికుల పేరుతో కొందరు దాడి చేయడంతో శుక్రవారం నాడు ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో సింఘు, టిక్రి ప్రాంతాల్లో రైతులు ఉద్యమం చేస్తున్న చోట భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ నేపథ్యంలో పరిస్థితులను అదుపులో ఉంచుతూ, భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఉద్రిక్త ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుండి జనవరి 31 రాత్రి 11 గంటల వరకు సింఘు, ఘాజిపూర్ మరియు టిక్రి వాటి పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. మరోవైపు జనవరి 30 న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రైతులందరూ సద్భావన దినం పాటిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులంతా ఉపవాస దీక్షకు కూర్చున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ