ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి:
“ప్రస్తుతం కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటన్నింటిని ఆరోగ్యశ్రీ కిందకు చేర్చాలని కమిటీ నిర్ణయించింది. కాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికీ 40 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించాము. పెట్ స్కాన్ కూడా ఏర్పాటు చేశాము. క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము” అని మంత్రి ఈటల తెలిపారు.
కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని పెంచాయి:
“కరోనా సమయంలో డాక్టర్లు బయటకు రాకుండా, హాస్పిటల్స్ మూసివేసిన సందర్భంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించారు. గత ఆరు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేసిన పనులకు మంత్రివర్గ ఉప సంఘం అభినందనలు తెలియజేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా కేరళ, తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని మరింత పెంచాయి. ఎంఎంఆర్ రేటు 92 నుంచి 63 కి, ఐఎంఆర్ రేటు 39 నుంచి 27 కి తగ్గటంలో కేసీఆర్ కిట్ పాత్ర గణనీయంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున తగిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం” అని మంత్రి అన్నారు.
“ఆశా వర్కర్ల మొదలుకొని మిగిలిన అందరికీ మెరుగైన జీతం ఇవ్వడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆశ వర్కర్స్ కి మొదట్లో కేవలం 1500 రూపాయలు జీతం ఉండగా ఇప్పుడు గణనీయంగా పెంచుకున్నాము. సబ్ సెంటర్లను వెల్నెస్ సెంటర్లుగా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాము. ఇలాంటి మంత్రివర్గ నిర్ణయాలు అన్నింటినీ ముఖ్యమంత్రికి నివేదిస్తాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజీలో వరకు తీసుకోవాల్సిన సంస్కరణలు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాల మీద హాస్పిటల్ వారిగా పూర్తిస్థాయిలో చర్చించాము. వీటన్నింటి మీదా త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ వైద్యంను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులు పని చేస్తాయని ఆశిస్తున్నాము” అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu