దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడవ రోజు ఆటలో పూర్తిగా బౌలర్లు హవా సాగింది. మహ్మద్ షమి (5/44) కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్లు సాధించి సఫారీల పని పట్టాడు. దీంతో భారత్కు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ 146 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పేసర్ మహ్మద్ షమి అద్భుత బౌలింగ్తో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 62.3 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. బవుమా (52), డికాక్ (34) మాత్రమే రాణించారు. శార్దూల్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రోజు ముగిసే సరికి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (4) పెవిలియన్ చేరగా, క్రీజులో కేఎల్ రాహుల్ (5 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (4 బ్యాటింగ్) ఉన్నారు.
తొలి రోజు 272/3 స్కోరుతో అత్యంత పటిష్టంగా కనిపించిన భారత్ మూడో రోజు తడబడింది. పేసర్ ఎంగిడితో పాటు రబాడ చెలరేగడంతో భారత్ ఎక్కువ పరుగులు చేయలేదు. పిచ్పై తేమను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న ఎంగిడి మిడిలార్డర్ భరతం పట్టాడు. శతకం సాధించిన రాహుల్ 12 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి రబాడ షార్ట్ బాల్కు అవుటయ్యాడు. ఇక అర్ధసెంచరీ ఖాయమనుకున్న రహానెను ఎన్గిడి పెవిలియన్ చేర్చడంతో భారత్ వికెట్ల పతనం జోరందుకుంది. రిషభ్ పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ (4), షమి (8), బుమ్రా (14) కొద్దిసేపు కూడా క్రీజులో నిలువలేదు. దీంతో మూడో రోజు ఆటలో 55 పరుగులు మాత్రమే జోడించి చివరి ఏడు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది.
చెలరేగిన షమి
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమి చెలరేగటంతో సఫారీ వేగంగా వికెట్లను కోల్పోయింది. రబాడను అవుట్ చేయడంతో షమి ఐదు వికెట్లతో పాటు కెరీర్లో 200 వికెట్ల మైలురాయికి చేరాడు. చివరి వికెట్ను బుమ్రా తీశాడు. భారత్ తరఫున తక్కువ టెస్టుల్లో (26) వికెట్ల వెనుకాల వంద మందిని అవుట్ చేసిన కీపర్గా రిషభ్ పంత్ నిలిచాడు. ఈ క్రమంలోధోనీ (36)ని అధిగమించాడు. భారత్ తరఫున టెస్టుల్లో 200 వికెట్లు తీసిన ఐదో పేసర్గా మహ్మద్ షమి. కపిల్ (434) ముందున్నాడు. అయితే ఈ ఫీట్ కోసం తక్కువ బంతులు (9,896) తీసుకున్న భారత బౌలర్గా నిలిచాడు. అశ్విన్ (10,248) ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ