దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రంగాలు ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకింగ్ రంగం కూడా కీలక నిర్ణయాలను అమలు చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్యాంకు పనివేళలను పరిమితం చేయాలని, ప్రాథమిక సేవలకు మాత్రమే కట్టుబడి ఉండాలని అన్ని సభ్య బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సలహా ఇచ్చింది. బ్యాంకుల పని గంటలను ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు పరిమితం చేయవచ్చని, అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించాలని ఐబీఏ సూచించింది.
గత సంవత్సరం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పుడు బ్యాంకుల కార్యకలాపాలపై రెండు సలహాలను జారీ చేసామని, అయితే ఈ సంవత్సరం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాలలో కరోనా తీవ్రత పరిస్థితులను బట్టి నిబంధనలు మారుతుండడంతో అందుకు అనుగుణంగా బ్యాంకు కార్యాకలాపాల ప్రణాళికలను సర్దుబాటు చేయాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలకు (ఎస్ఎల్బిసి) ఐబీఏ సూచించినట్టు తెలుస్తుంది. స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు అనంతరం పలు రాష్ట్రాలు బ్యాంకుల పని గంటలను ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కుదించాయి. ఏప్రిల్ 23, శుక్రవారం నుంచి మే 15వ తేదీ వరకు ఈ కుదించిన పని వేళలు అమలులో ఉండనున్నాయి. మే 15 తర్వాత మరోసారి పరిస్ధితిని సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెల్లింపులు మరియు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు యథావిధిగా జరగనున్నాయి. ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఎస్ఎల్బిసిలు ఆయా చోట్లలో పరిస్థితిని సమీక్షించి అదనపు సేవలను నిర్ణయించనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ