భారతీయ ఆహార ఉత్పత్తులకు ఇతర దేశాల్లో భారీగా డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే తమకు అదనంగా ఇండియన్ ఫుడ్ అందించడానికి అనుగుణంగా.. దిగుమతులకు వీలు కల్పించాలని కొన్ని దేశాలు భారతదేశాన్ని వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ ప్రొడెక్ట్స్, బాస్మతి రైస్, ఆక్వా ప్రొడెక్ట్స్ , గోధుమ ఉత్పత్తులకు.. కొన్ని దేశాలలో భారీ డిమాండ్ ఉంటుందని.. యుఏఈ ఆహార పరిశ్రమ చెబుతోంది. అందుకే వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది.
ఏపీఈడీఏ అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సమన్వయంతో.. వివిధ ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరుతూ యూఏఈ ఆహార పరిశ్రమ భారతదేశం ముందు నిలబడుతోంది. కువైట్, బహ్రెయిన్,సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో.. ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తులకున్న ఎక్కువ నాణ్యతతో పాటు ప్యాకేజింగ్ కూడా సహాయపడుతుందని చెబుతోంది.
ఈ మధ్య భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూఏఈలో పర్యటించి.. యూఏఈ విన్నపం గురించి అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపైన సుధీర్ఘంగా చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని.. గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సీ సేల్స్ యూఏఈ హెడ్ నిస్సార్ తలంగర పీయూష్ గోయల్కు వివరించారు.
ముఖ్యంగా భారతదేశంలో పండిన బాస్మతీ బియ్యానికి భారీ డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై ఎమ్ఈపీ అంటే కనీస ఎగుమతి ధర తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో చాలా సహాయపడుతుందని ఒమన్కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. దీంతో ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ మాంసం విషయంలో సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారతదేశంలో అత్యంత మెరుగైన హలాల్ మీట్ ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం హలాల్ మాంసం ఉత్పత్తుల ఎక్స్పోర్టులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ..అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి అభిప్రాయపడ్డారు.
అలాగే రిటైల్ ప్రొక్యూర్మెంట్ చోయిత్రమ్స్ హెడ్.. కీర్తి మేఘనాని కూడా ఇలాంటి అభిప్రాయాలనే బయటపెట్టారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో బిజినెస్ను పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. అంతేకాదు ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ..ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని యాప్కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ సూచించారు.
భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ప్రొడెక్ట్లకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని జీసీసీ గ్రూప్నకు చెందిన మరో దిగుమతిదారు కోరారు. నిజానికి భారత్ ,యూఏఈ వాణిజ్య ఒప్పందం 2022 మేలో అమల్లోకి వచ్చింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-2022లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-2023లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.