ది మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్ అయిన వంగవీటి రాధా ఇంట పెళ్లి పనులు జోరందుకున్నాయి. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం ఈ నెల 22న వంగవీటి జరగనుంది. నర్సాపురంలో వంగవీటి రాధాకృష్ణకు పుష్పవల్లితో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. నర్సాపురానికి చెందిన పుష్పవల్లితో రాధా వివాహం ఖరారవడంతో ఇటు వంగవీటివారింటితో పాటు.. వంగవీటి అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలయింది. ఎప్పటి నుంచో పెళ్లి మాటంటేనే ఆమడ దూరం పరిగెట్టిన రాధా మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనుండటంతో.. వంగవీటి వర్గీయులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వంగవీటి రాధా వివాహానికి రాజకీయాల నుంచే కాకుండా ఇతర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో, కళ్యాణ వేదిక ఎంపిక నుంచి అతిథులకు వడ్డించే ఆహారం వరకూ ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో రాధా వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.
వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. సరిగ్గా మరో 12 రోజుల్లో అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి గం. 7.59 నిమిషాలకు.. శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నమందు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలు ఒక్కటయ్యేందుకు రెండు పక్షాల పెద్దలు.. శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు.
రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రెటీలతో పాటు వంగవీటి కుటుంబానికి పెద్ద సంఖ్యలో ఉన్న అభిమాన గణం కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో కళ్యాణ వేదికను దానికి అనుగుణంగా ఖరారు చేసారు. విజయవాడ టూ నిడమానూరు పోరంకి రోడ్డులోని మురళీ రిసార్ట్స్లో వంగవీటి రాధా వివాహం జరుగనుంది. ఇప్పటికే ఆహుతులకు ఇచ్చే శుభలేఖలు సిద్ధమవడంతో.. తమ ఆప్తులకు శుభలేఖలు స్వయానా అందిస్తూ వంగవీటి కుటుంబసభ్యులు బిజీగా మారిపోయారు.
ది మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్ అయిన వంగవీటి రాధా ఎట్టకేలకు నర్సాపురం అల్లుడు కాబోతున్నారు. నరసాపురం పట్టణానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జక్కం అమ్మాని 1987 నుంచి 1992 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్గా బాధ్యతలను కూడా నిర్వహించారు. అమ్మాని, బాబ్జి దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లి. పుష్పవల్లి స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నర్సాపురంలోనే జరిగింది.
తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన పుష్పవల్లి అక్కడే చదువుకున్నారు. అంతేకాదు కొంతకాలం హైదరాబాద్లో యోగా టీచర్గా కూడా పుష్పవల్లి పనిచేశారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు. పుష్పవల్లి తండ్రి బాబ్జీ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే కొన్ని కారణాలవల్ల నర్సాపురంలో కాకుండా కొంతకాలం హైదరాబాదులోనే ఆయన కుటుంబంతో సహా నివాసం ఉన్నారు.
జక్కం బాబ్జి ఇటీవలే మళ్లీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం పూర్తి చేసుకుని నరసాపురంలోనే నివాసముంటున్నారు.ఈ మధ్యనే ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయి.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం విచ్చేసినప్పుడు.. జక్కం బాబ్జి ఇంట్లోనే బస చేశారు.
ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా.. వంగవీటి రాధా వీరి నివాసానికి విచ్చేసిన జక్కం బాబ్జి.. రంగా జయంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రెండు కుటుంబాలు వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహ సంబంధం గురించి మాట్లాడుకున్నారు. చివరకు కళ్యాణం వచ్చినా , కక్కు వచ్చినా ఆగదన్న సామెతలా ఇన్నాళ్లు బ్రహ్మచారిగా ఉన్న రాధా ఓ ఇంటివాడవబోతున్నాడు. విజయవాడలోనే రాధా వివాహ ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. మరోవైపు రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు.. రాధా సిద్దం అవుతున్నారని వార్తలు కూడా జోరందుకున్నాయి.