దేశంలో కీలక వాణిజ్య నగరమైన ముంబయి స్థంభించిపోయింది. ఈ రోజు ఉదయం నగరంలోని పలు కీలక ప్రాంతాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పారిశ్రామిక వ్యవస్థతో పాటుగా, ప్రజా రవాణా కు సంబంధించి రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ముంబయి నగరానికి విద్యుత్ సరఫరా చేసే టాటాకు చెందిన గ్రిడ్ లో లోపం తలెత్తడం వలనే ఈ అంతరాయం ఏర్పడిందని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రకటించింది. ముంబయిలో పలు ప్రాంతాల్లో రైళ్లు ఆగిపోగా, కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయడం మానేశాయి. నగరం ఒక్కసారిగా స్తంభించిపోవడంతో సెలెబ్రిటీలు, ప్రజలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి చర్చించారు.
ముంబయి నగరంలో ఇంత స్థాయిలో విద్యుత్ వైఫల్యం ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. దశలవారీగా నగరంలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతోంది. ముంబయిలో గ్రిడ్ వైఫల్యంపై సీఎం ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్, బీఎంసీ కమిషనర్తో చర్చించారని, వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ ఆదేశాలు ఇచ్చారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం పేర్కొంది. విద్యుత్తు వైఫల్యం నేపథ్యంలో ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఐసీయూలలో సేవలకు ఇబ్బందులు రాకుండా కనీసం ఎనిమిది గంటలు పాటుగా సరిపడేలా డీజిల్ ను సమకూర్చుకోవాలని ఆసుపత్రులకు బీఎంసీ ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu