పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్సభ, రాజ్యసభల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతుండడంతో గందరగోళం నెలకుంటుంది. ఉభయసభలు కూడా రోజులో పలుమార్లు వాయిదా పడుతున్నాయి. గురువారం కూడా లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలు చేయడంతో సభను ముందుగా 12 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కూడా ఎంపీలు నిరసనను కొనసాగించడంతో సభను జూలై 26, సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాజ్యసభలోనూ పెగాసస్ సహా పలు అంశాలపై ఎంపీలు నిరసనలు చేపట్టడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గురువారం నాడు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలోప్రకటన చేస్తూ ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులు మరియు ఇతరులపై పెగాసస్ స్పైవేర్ తో స్నూపింగ్ చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీ శాంతను సేన్ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చేతిలో ఉన్న పేపర్లను లాక్కొని చింపేశారు. ఈ ఘటన రాజ్యసభలో కలకలం సృష్టించింది. ఈ క్రమంలో గురువారం నాడు సభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మిగిలిన రోజులకు టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని ఆమోదించి, ఎంపీ శాంతను సేన్ ను సభనుంచి వైదొలగాలని కోరారు. ఈ నిర్ణయంతో ఎంపీలు తమ నిరసనను మళ్ళీ కొనసాగించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పెగాసస్ అనే స్పైవేర్ ను ఇజ్రాయెల్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించటానికి ఏర్పాటుచేసిన ఆయుధమని అన్నారు. అలాంటి స్పైవేర్ ను దేశంలో నాయకులకు వ్యతిరేకంగా ఉపయోగించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది, అలాగే హోంమంత్రి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ