పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు (నవంబర్ 29, సోమవారం) ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటుగా డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో 26 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏ అంశంపై అయినా చర్చిండానికి మరియు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విధంగానే సమావేశాల తొలిరోజునే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాగా సభ ప్రారంభం కాగానే 3 నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలు, గందరగోళం మధ్యనే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టి ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదించింది. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష ఎంపీలు వ్యవసాయ చట్టాల రద్దుపై చర్చ, కనీస మద్ధతు ధర (ఎంఎస్పి) చట్టం, త్రిపుర హింస సహా పలు అంశాలపై ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్పర్సన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఎంపీల నినాదాలతో రాజ్యసభ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైన అనంతరం రాజ్యసభలో కూడా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా, ఆమోదం పొందింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ