74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా కరోనా యోధులందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తలందరికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో మరో గొప్ప మార్పుకి నాంది పలుకుతున్నట్టు తెలిపారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం) వివరాలను ప్రధాని మోదీ వివరించారు. ఎన్డీహెచ్ఎం కింద దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఐడీ నంబర్ను కేటాయించనున్నారని, పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ మిషన్ నడుస్తుందని తెలిపారు. ప్రతి భారతీయుడి పూర్తి వైద్య సమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని మోదీ వెల్లడించారు.
“ప్రతి భారతీయుడికి ఒక హెల్త్ ఐడీ కార్డ్ లభిస్తుంది. మీరు డాక్టర్ ను లేదా ఫార్మసీని సందర్శించిన ప్రతిసారీ సంబంధిత వివరాలు మీ ఐడీ ప్రొఫైల్లో జాతీయ స్థాయిలో నమోదు అవుతాయి. డాక్టర్ అపాయింట్ మెంట్ నుంచి, మెడికేషన్ వివరాల వరకు మీ ఆరోగ్య ప్రొఫైల్లో అందుబాటులో ఉంటుంది. ఎన్డీహెచ్ఎం మిషన్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. వైద్య రంగంలో గణనీయమైన మార్పులకు ఈ మిషన్ దోహదం చేస్తుందని” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
“కరోనావైరస్ కట్టడికోసం దేశంలో మూడు వ్యాక్సిన్లు యొక్క పరీక్షలు వివిధ దశలలో ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ పై సైంటిస్ట్స్ ముందుకు వెళ్ళినప్పుడు, ఉత్పత్తి కోసం ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాము. ఈ వ్యాక్సిన్ ప్రతి భారతీయుడికి కనీస సమయంలో ఎలా చేరుతుందనే అంశంతో పాటుగా ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్ అందించేందుకు కావాల్సిన రోడ్మ్యాప్ సిద్ధంగా ఉందని” ప్రధాని మోదీ తెలిపారు.
మరోవైపు దేశ సైనికులపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఎల్వోసీ నుంచి ఎల్ఏసీ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, వారికి గట్టిగా జవాబు ఇచ్చామని చెప్పారు. గాల్వన్ లోయలో ఘటనను ఉద్దేశిస్తూ, మన జవాన్లు సత్తా, మన దేశం ఏం చేయగలదనే విషయాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, సైనికుల సాహసానికి వందనాలు చెబుతున్నానని ప్రధాని మోదీ అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రజలంతా సంకల్పించుకోవాలని చెప్పారు. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ కోసం పాటుపడాలి. భారత్ లో తయారీ చేసే వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. గతంలో లాగా భారత్ వస్తువులకు పూర్వ వైభవం తెద్దాం. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu