ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు ప్రారంభంకాగా, ముంబయి-సోలాపూర్ 9వ, ముంబయి-సాయినగర్ షిర్డీ 10వ వందే భారత్ రైళ్లుగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ముంబయిలో రోడ్డు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి శాంతాక్రూజ్ చెంబూర్ లింక్ రోడ్ మరియు కురార్ అండర్పాస్ ప్రాజెక్ట్ అనే రెండు రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రధాని దేశానికి అంకితం చేశారు. ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్లాట్ఫారమ్ నంబర్ 18 వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ రైలును పరిశీలించారు. రైలు సిబ్బంది మరియు కోచ్లోని పిల్లలతో కూడా ప్రధాని సంభాషించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో రైల్వేలకు ఇది చాలా పెద్ద రోజని, ముఖ్యంగా మహారాష్ట్రలో అధునాతన కనెక్టివిటీ కోసం ఒకే రోజు రెండు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ వందే భారత్ రైళ్లు ముంబయి, పూణే వంటి ఆర్థిక కేంద్రాలను విశ్వాస కేంద్రాలకు అనుసంధానం చేస్తాయని, తద్వారా కళాశాల, ఆఫీసు, వ్యాపారం, తీర్థయాత్ర మరియు వ్యవసాయ అవసరాల కోసం ప్రయాణించే వారికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.కొత్త వందే భారత్ రైళ్లతో షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని, ఇది పర్యాటకంతో పాటు పుణ్యక్షేత్రాలకు ఊతమిస్తుందని అన్నారు. “పంఢర్పూర్, షోలాపూర్, అక్కల్కోట్ మరియు తుల్జాపూర్ తీర్థయాత్రలు షోలాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో మరింత అందుబాటులోకి వస్తాయి” అని ప్రధాని చెప్పారు.
వందే భారత్ రైలు ఆధునిక భారతదేశానికి గొప్ప చిత్రమని ప్రధాని అన్నారు. ఇది భారతదేశం యొక్క వేగం మరియు స్థాయికి ప్రతిబింబం. వందే భారత్ రైళ్ల ప్రారంభ వేగాన్ని గురించి ప్రధానివ్యాఖ్యానిస్తూ, దేశంలోని 17 రాష్ట్రాల్లోని 108 జిల్లాలను కలుపుతూ ఇప్పటివరకు 10 వందే భారత్ రైళ్లు నడవటం ప్రారంభించాయని తెలియజేశారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించే అనేక ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర సహాయ మంత్రులు రాందాస్ అథవాలే, కపిల్ మోరేశ్వర్ పాటిల్, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE