ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. ఈ పర్యటనలో ముందుగా నగరంలో ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సుమారు 8వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించటానికి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలియజేశారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ వివరాలు ఇవే:
- రేపు (శనివారం) మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు.
- అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ MI-17లో బయల్దేరి మధ్యాహ్నం 2:45 గంటలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిశాట్కు చేరుకుంటారు.
- సాయంత్రం 4:15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ నూతన లోగోను, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ.
- సాయంత్రం 4:25 గంటలకు ఇక్రిశాట్ సభావేదిక నుంచి తిరిగి హెలికాప్టర్లో హైద్రాబాద్ లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- అనంతరం రోడ్డు మార్గంలో, సాయంత్రం 5 గంటల సమయానికి ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి వారి ఆశ్రమం శ్రీరామనగరానికి చేరుకుంటారు.
- ఈ సందర్భంగా చినజీయర్ స్వామి ప్రధానికి ఎదురేగి స్వాగతం పలకనున్నారు.
- సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు.
- ఈ క్రమంలో మొదట యాగశాలకు చేరుకొని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
- తర్వాత సాయంత్రం 7 గంటలకు 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల వారి ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. తదనంతరం ఒక అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
- ప్రధాని సమక్షంలో రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
- అనంతరం మరోసారి యాగశాలకు చేరుకుని ఆరోజు నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు ప్రధాని మోదీ.
- ఈ సందర్భంగా 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద ఆశీర్వచనం ఇవ్వనున్నారు.
- ఆ తర్వాత ప్రధాని రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. తదుపరి ప్రత్యేక విమానంలో తిరిగి రాజధాని ఢిల్లీకి పయనమవనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ