ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో వెలుగు చూసిన భద్రతా లోపాలపై, దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. రిటైర్డ్ జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్, హోం అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఫిరోజ్పూర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దయింది. ప్రధాన మంత్రి మోదీ భద్రత విషయంలో తీవ్ర లోపం ఉందని, అందువల్లే ఈ సభ రద్దయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దీనిపై నివేదికను సమర్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం భటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో.. హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్ళవలసి ఉంది. వర్షం కురుస్తుండటంతో ఆయన దాదాపు 20 నిమిషాలపాటు వేచి చూశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో.. రోడ్డు మార్గంలో ప్రయాణించి అమరవీరుల స్మారక కేంద్రానికి చేరుకోవాలని ప్రధాని భావించారు. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో, పంజాబ్ డీజీపీకి విషయాన్ని తెలిపి రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రారంభించారు.
అయితే, జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో.. ఓ ఫ్లైఓవర్ వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకునేసరికి, కొందరు నిరసనకారులు ఆ రోడ్డును దిగ్బంధనం చేసినట్లు తెలిసింది. ఆ ఫ్లైఓవర్పై ప్రధాని దాదాపు 20 నిమిషాలపాటు చిక్కుకున్నారు. ఇది ప్రధాన మంత్రి భద్రత విషయంలో అత్యంత ప్రధాన లోపం. దీంతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్లో పాల్గొనవలసిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరియు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ