శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే, తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన వర్లీ నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలో బీజేపీ-శివసేన పార్టీలు కూటమిగా పోటీచేసి చేసి మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగాయి. మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది, గతంలో కంటే తక్కువ స్థానాలు సాధించి 100+ సీట్లకే పరిమితమయ్యేలా ఉంది. మరోవైపు మిత్రపక్షం శివసేన గతంలో కంటే కొన్ని స్థానాలను మెరుగుపరుచుకొని, రాష్ట్రంలో కింగ్మేకర్ పాత్ర పోషించబోతుంది.
ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరి సగం పంచుకోవాలని శివసేన పార్టీ కోరుకుంటుంది. గతంలో మాదిరిగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీ పార్టీకి ఇచ్చేది లేదని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే స్పందిస్తూ 50-50 పదవీకాల సూత్రాన్ని గతంలోనే నిర్ణయించాం, బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారో నిర్ణయించుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో శివసేన ప్రతిపాదనకు, బీజేపీ పార్టీ అంగీకరిస్తే అతి చిన్న వయసులోనే ఆదిత్య థాకరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇరు పార్టీల ఆమోదం అవసరమైన పరిస్థితులల్లో ఒకట్రెండు రోజుల్లో ఉత్కంఠ వీడి మహారాష్ట్రకు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో స్పష్టత రానుంది.
[subscribe]