హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో ఆధిక్యత సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43358 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెరాస అభ్యర్థికి హుజూర్నగర్ ప్రజలు అద్భుతమైన మెజార్టీతో అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ప్రతికూల వాతావరణం వలన తన సభ జరగకపోయినా, ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్ లా పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉప ఎన్నికలకు ఇంఛార్జ్ గా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 26, శనివారం నాడు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహించి ప్రజలను కలుస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి వుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు అర్థంపర్థం లేనటువంటి, దురహంకార పద్ధతిని అవలంబిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలను నాలుగేళ్ళ లోపులోనే 67 శాతం పెంచామని, దేశంలో ఇలా పెంచిన చరిత్ర ఎక్కడా లేదని చెప్పారు. కార్మికులు చేస్తున్న విలీనం డిమాండ్ అసంబద్ధమైన, తెలివితక్కువైన నినాదమని పేర్కొన్నారు. త్వరలో ఆర్టీసీ సమ్మె కాదు, ఆర్టీసీనే ముగుస్తుంది, ముగిసిపోతుందని అన్నారు. ఆదాయం వచ్చే దసరా పండుగ సమయంలో గొంతెమ్మ కోరికలతో ఆర్టీసీ కార్మికులు తప్పుదోవ పట్టారని చెప్పారు. మరో వైపు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో రేపు స్పష్టత వస్తుందని, నవంబర్ నెలలోనే ఎన్నికలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే గ్రామాలలో నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక లాగానే, పట్టణాలలో కూడ అటువంటి కార్యాచరణ చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.
[subscribe]