శ్రీలంకలో శనివారం అనూహ్య పరిణామాలు సంభవించాయి. గత కొన్ని నెలలుగా ఆ దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వారాల క్రితం మహింద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ రోజు రోజుకి పరిస్థితులు ఇంకా దిగజారిపోవడంతో పాలకులపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం చెందిన నిరసనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి పారిపోయారని ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు.
కాగా నేటి ఆందోళనకు ముందు రాజధాని నగరంలో భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడారు. రాజపక్స రాజీనామా డిమాండ్తో ఆందోళనకు దిగగా ప్రభుత్వం అధ్యక్ష భవనం పరిసరాల్లో కఠినమైన కర్ఫ్యూను అమలు చేసింది. అయినాసరే లెక్క చేయని నిరసనకారులు వేలాదిగా చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది కూడా వారిని అడ్డుకోలేకపోయారు. దీనికి ముందు శుక్రవారం దేశంలో నిరసనలను చట్టవిరుద్ధం చేయాలనే పోలీసుల అభ్యర్థనలను న్యాయమూర్తులు తిరస్కరించడంతో, రాజపక్స అధికారిక నివాసానికి భద్రతను పటిష్టం చేసేందుకు వేలాది మంది సైనికులకు రైఫిల్స్ అందించి కాపలాగా నిలబెట్టారు. కానీ వీటన్నింటికీ బెదరని ఆందోళనకారులు సైనికుల ఆజ్ఞలను ధిక్కరిస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పరిస్థితులు చేయిదాటి పోయాయి. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం ఎక్కడున్నారనేది మాత్రం అధికార వర్గాలు వెల్లడించడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ