టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. శనివారం సాయంత్రం బాడ్మింటన్ లో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3 కేటగిరి ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్ ను 21-11 21-16 తేడాతో ప్రమోద్ భగత్ ఓడించి భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతాకాన్ని చేర్చాడు. పారాలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా ప్రమోద్ భగత్ రికార్డ్ సృష్టించాడు. అలాగే ఎస్ఎల్-3 కేటగిరిలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత క్రీడాకారుడు మనోజ్ సర్కార్ జపాన్కు చెందిన పుజిహారాను 22-20, 21-13 తేడాతో ఓడించి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు.
మరోవైపు శనివారం ఉదయం జరిగిన షూటింగ్ (మిక్సిడ్ 50m పిస్టోల్ SH1) ఫైనల్ లో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకం సాధించగా, సింఘ్ రాజ్ అదానా రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పారాలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య 17 కు (నాలుగు స్వర్ణం, ఏడు రజతం, ఆరు కాంస్యాలు) చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ