దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు విరాళాలు ప్రకటించగా, తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. భారత్ లో కరోనా సంక్షోభం పరిష్కారంలో భాగంగా 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం నాడు ట్వీట్ చేశారు. కేర్ సంస్థకు 10 మిలియన్ డాలర్లు కేటాయించగా, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ సంస్థలకు చెరో 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళమిచినట్టు తెలిపారు.
సేవా ఇంటర్నేషనల్ కు ఇచ్చిన నిధుల ద్వారా ప్రాణవాయువు పరికరాలైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, బైపాప్ మరియు సీపాప్ పరికరాల కొనుగోలు జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ కు మరియు ఇతర ఆసుపత్రులకు ఈ పరికరాలు పంపిణీ చేయబడతాయన్నారు. ఎయిడ్ ఇండియా గ్రాంట్ ద్వారా అండర్-రిసోర్స్డ్ కమ్యూనిటీలలో కరోనా లక్షణాలను గుర్తించడానికి, వ్యాప్తి నిరోధించడానికి, సంరక్షణ మరియు చికిత్సను అందించడానికి, ఆక్సిజన్, ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు అందించడం, లాక్ డౌన్ నుండి బయటపడటం, జీవనోపాధిని తిరిగి పొందడం మరియు గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించే ఆసుపత్రులు మరియు ఎన్జిఓలను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నట్టు తెలిపారు. కేర్ సంస్థ ద్వారా దేశంలో సెకండ్ వేవ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్యకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పాటు ఇచ్చేందుకు నిధులు ఉపయోగించబడతాయని, అలాగే ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ఆక్సిజన్, పిపిఇ కిట్లు మరియు ఇతర క్లిష్టమైన అవసరమైన అత్యవసర సామాగ్రిని అందించడం, మరియు గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడటం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ